K. Keshava Rao: కాంగ్రెస్‌లో చేరుతారని జోరుగా ప్రచారం... ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన కేకే

  • ఇటీవల కేకే ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ నేతలు
  • ఈరోజు కేసీఆర్ వద్దకు వెళ్లిన కేకే... వెంట ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ 
  • పార్టీ మార్పు గురించి చెప్పడానికి కేకే వెళ్లినట్లుగా ఊహాగానాలు
  • కేసీఆర్ వద్దకు వెళ్లినప్పుడు కేకే చేతిలో పేపర్లు
KK meets kcr in Farm house

బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ కె.కేశవరావు గురువారం మధ్యాహ్నం పార్టీ అధినేత కేసీఆర్‌ను ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో కలిశారు. ఆయన పార్టీ మారుతారని కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు కేసీఆర్ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేకే వెంట ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ కేకే ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు.

తనకు బీఆర్ఎస్‌లో ఎంతో ప్రాధాన్యత ఇవ్వడంతో కేసీఆర్‌ను కలిసి పార్టీ మార్పు అంశంపై చెప్పేందుకు వెళ్లినట్లుగా ప్రచారం సాగుతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లినప్పుడు ఆయన చేతిలో కొన్ని పేపర్లు ఉన్నాయి. దీంతో ఆయన రాజీనామా సమర్పించేందుకు వెళ్లి ఉంటారనే చర్చ సాగుతోంది. దాదాపు గంటపాటు కేసీఆర్‌తో కేకే భేటీ అయ్యారు.

కేకే తన రాజకీయ భవిష్యత్తుపై నిన్న తన ఫ్యామిలీతో చర్చించినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ తనకు చాలా చేసిందని, రిటైర్మెంట్ వయస్సులో తన సొంత పార్టీ వైపు చూస్తే తప్పేమిటని కేకే వ్యాఖ్యానిస్తున్నారు. కేకే కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితోనూ పలువురు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. మేయర్ కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వెళతారనే ప్రచారం సాగుతోంది.

More Telugu News